

*ఎం.ఎం.పీ.టీ.ఎఫ్ అమలుకు సహాయ సహకారాలు అందిస్తాం*
*కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*
నిజామాబాద్, ఫిబ్రవరి 21 : వలసదారులు, దుర్బల కుటుంబాల స్థితి స్థాపకతను మెరుగుపర్చాలనే లక్ష్యంతో యుఎన్ఓ ద్వారా ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో అమలు చేయనున్న మైగ్రేషన్ మల్టీ పార్టునర్ ఫండ్ (ఎం.ఎం.పీ.టీ.ఎఫ్) కార్యక్రమాన్ని పక్కాగా అమలు పరుస్తూ, నిర్దేశిత లక్ష్యాలు సిద్ధించేలా జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ కార్యక్రమం అమలు విషయమై కేంద్ర ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో శుక్రవారం సమీక్ష సమావేశం జరిపారు. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం, పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాను ఎంపిక చేయడానికి గల కారణాలు, ఎంఎంపీటీఎఫ్ ను అమలు చేయాల్సిన విధానం, యూఎన్ఓ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందించే తోడ్పాటు తదితర అంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో వలసదారులు, దుర్బల కుటుంబాల స్థితిగతుల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలియజేశారు. వారి స్థితిగతులలో మార్పును ఆశిస్తూ అమలుచేయ సంకల్పించిన పైలెట్ ప్రాజెక్టును జిల్లాలో సమర్ధవంతంగా అమలయ్యేలా జిల్లా యంత్రాంగం ద్వారా పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. పూర్తి పారదర్శకంగా ఈ కార్యక్రమం అమలయ్యేలా చూస్తామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పి సీ.ఈ.ఓ సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, డీడబ్ల్యుఓ రసూల్ బీ, పశు సంవర్ధక శాఖ అధికారి జగన్నాథ చారీ, డీపీఓ శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఏ.డీ.ఏ ప్రదీప్ కుమార్, సిరికొండ, ధర్పల్లి ఏ.ఓలు నర్సయ్య, వెంకటేష్, యూఎన్ఓ ప్రతినిధులు జగన్మోహన్, డాక్టర్ లిస్సీ జోసెఫ్, వాసం స్వచ్చంద సంస్థ ప్రతినిది అనిల్ ఉప్పలపాటి తదితరులు పాల్గొన్నారు.