
*కూతురి పెండ్లి.. మండపం లోనే గుండెపోటుతో తండ్రి మృతి..*
కాళ్లు కడిగి బిడ్డ కన్యాదానం చేయాల్సిన తండ్రి.. అప్పటి వరకు హుషారుగా బిడ్డ పెండ్లి పనుల్లో మునిగి తేలాడు.. బంధువులను ఆహ్వానించారు. కళ్యాణ మండపమంతా కలియ తిరిగి పెళ్లి పనులు చూసుకున్నాడు. అయితే, ఇంతలోనే మాయదారి గుండెపోటు.. అప్పటి వరకు హుషారుగా తిరిగిన వ్యక్తి కుప్ప కూలాడు..
*కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం..*
కన్న కూతురు పెండ్లి జరుగుతుండగా.. పెండ్లి మండపం లోనే గుండెపోటుతో కుప్పకూలి పోయాడు ఓ తండ్రి.. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో, పెండ్లి ఇంట్లో విషాదం నెలకొంది.
భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లికి చెందిన కుడిక్యాల బాలచంద్రం (54) గుండెపోటుతో మృతి చెందారు. జిల్లా కేంద్రం లోని హౌజింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న బాలచంద్రం.. శుక్రవారం (ఫిబ్రవరి 21)న తన పెద్ద బిడ్డ మహాలక్ష్మీ పెండ్లి స్థానిక ఫంక్షన్ హాల్ లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.. కుటుంభ సభ్యులు, బంధువులు అందరూ పెండ్లి మండపం చేరుకున్నారు. పెళ్లి తంతు మొదలైంది. తాళి కట్టే కొద్ది సమయానికి ముందు బాలచంద్రం ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. చికిత్సకోసం బాలచంద్రాన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. బాలచంద్రానికి సీపీఆర్ చేసి పరీక్షించారు డాక్టర్లు.. అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు నిర్దారించారు..