


నిరుద్యోగ యువతి, యువకులకు ప్రజా ప్రభుత్వం అండ గా ఉంటుంది.
రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.
రంగారెడ్డి జిల్లా ఏప్రిల్04( సమయం న్యూస్)
నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, యువతకు ఉద్యోగాలు కల్పించడం వల్లనే తెచ్చుకున్న రాష్ట్రానికి అర్థం, పరమార్థం ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్ సైబర్ గార్డెన్ లో శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ప్లాంట్ అటెండెన్స్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, హౌస్ కీపర్స్ తో పాటు టీజీపీఎస్సీ ద్వారా ఆర్దిక శాఖలో నూతనంగా నియామకమైన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ కు నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ “ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ, యువకుల కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయని, వచ్చినటువంటి ఉద్యోగాల ద్వారా మా కుటుంబాల ఆర్థికంగా నిలబడటమే కాదు, ఆత్మగౌరవంతో బతకడానికి ఒక ఉపాధి దొరుకుతుందని దశాబ్దాల పాటు పోరాటం చేసిన నిరుద్యోగ యువతీ యువకులందరికీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమంలో ముందుంటుందని స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పమని చెప్పిన సందేశాన్ని” మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆశించి పోరాడిన యువతకు ఉద్యోగాలు కల్పించడం వల్లనే తెచ్చుకున్న రాష్ట్రానికి అర్థం, పరమార్థం ఉంటుందన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 59 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ఉద్యోగ అవకాశాలు పొందలేని నిరుద్యోగ యువతీ యువకుల కోసం 9 వేల కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలు అందించడానికి రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించామన్నారు.
నా రాజకీయ జీవితంలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఒకే సంవత్సరం స్వయం ఉపాధి పథకాల కోసం 9 వేల కోట్ల రూపాయలు కేటాయించడం చరిత్రలో లేదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రకటన చేయడం, వదిలేయడం లాంటి పని చేయకుండా రాజీవ్ యువ వికాస పథకం ప్రకటనకు ముందే దరఖాస్తుల ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక, సాంక్షన్, గ్రౌండింగ్ చేసేంత వరకు క్యాలెండర్ ఫిక్స్ చేసి ముందుగానే ప్రకటించమన్నారు. లక్షల మంది యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించడానికి హైదరాబాద్ నగరంలో ఐటీ సెక్టర్, నాలెడ్జ్ వ్యవస్థలను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. నాడు కొండలు గుట్టలు ఖాళీ ప్రదేశాలుగా ఉన్న హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటి సెక్టార్ నెలకొల్పడానికి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేసిన పునాదులు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఐటి సెక్టార్ ను అభివృద్ధి చేయడంతో ఈరోజు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం వల్ల ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థలు ఇక్కడికి వచ్చి కంపెనీలు పెట్టడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని వివరించారు.
హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ప్రజా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణం అందులో స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధికి మౌలిక వసతులు కల్పన కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు.
ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి పొందిన సంస్థలను తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని విస్తరించడంతో పాటు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లి లక్ష 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంవోయూ చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్- రీజినల్ రింగ్ రోడ్ మధ్యన చేయాల్సిన అభివృద్ధి పట్ల ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రగతి నిరోధకులు చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉంటూ నిరుద్యోగ యువతీ యువకులు అభివృద్ధి వైపు ముందుకు వెళ్లాలని సూచించారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశం, ప్రపంచంతో పోటీపడే విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్తు మంత్రిమండలి ముందుకెళ్తున్నదని వివరించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రిగా (భట్టి విక్రమార్క) నేను సమిష్టిగా ఆలోచన చేసి భూములు ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మాట ఇచ్చామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హత కలిగిన 112 మందికి యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి 35 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మా ప్రభుత్వం కల్పించిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ శాసన సభ్యులు లక్ష్మారెడ్డి, వైరా శాసన సభ్యులు రాందాస్ నాయక్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, విద్యుత్ ఎనర్జీ సిఎండి సందీప్ కుమార్ సుల్తానీయా, సంబంధిత అధికారులు, అభ్యర్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
—————–