
మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కోర్సులు
* యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐ/ ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను ఐటీఐ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కోర్సులకు అవసరమైన సిలబస్ రూపకల్పనకు ఓ కమిటీని నియమించి, నిపుణులు, విద్యావేత్తలు సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతి ఐటీఐ కళాశాలలకు ప్రిన్సిపాళ్లు ఉండేలా చూడాలని, శిక్షణ తీసుకుంటున్న వారికి సమగ్రమైన శిక్షణ అందేలా జాగ్రత్త పడాలని సూచించారు. ఐటీఐ కళాశాలల పర్యవేక్షణ, తనిఖీలు క్రమం తప్పకుండా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో ఐటీఐ/ ఏటీసీ లేని శాసనసభ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరం మినహా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.