
హైదరాబాద్, ఫిబ్రవరి 10 ::(సమయం న్యూస్) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న నూతన టూరిజం పాలసీ -2025 పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో సోమవారం జరిగింది.
రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన ప్రదేశాలను, వారసత్వ కట్టడాలను, గుర్తించి ప్రభుత్వం చేపట్టనున్న నూతన టూరిజం పాలసీలో పొందు పరుచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, హెల్త్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేసి తద్వారా పర్యాటకుల సంఖ్యను భారీ ఎత్తున ఆకర్షించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు చారిత్రక కట్టడాల సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలలో సందర్శించేందుకు స్కై వాక్ లాంటి ప్రాజెక్టును చేపట్టాలని సి.ఎస్ అధికారులకు సూచించారు.
ఇతర రాష్ట్రాలలో అమలులో ఉన్న వివిధ టూరిజం పాలసీలను అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రానికి సరిపడ నూతన టూరిజం పాలసీ-2025 ను యువజన, పర్యాటక శాఖ అధికారులు సిద్ధం చేశారు. నూతన పాలసీపై సి.ఎస్ సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల) కె.శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పరిశ్రమలు, ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు ఎస్.సంగీత, చంద్రశేఖర్రెడ్డి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, TGTDC MD ప్రకాష్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
——————————————————————————————————–