*పీ4 విధానంపై ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణకు పోర్టల్*
*ఉగాది నుంచి పీ4 విధానం అమలు :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు*
*అమరావతి, (సమయం న్యూస్ ప్రతినిధి) ఫిబ్రవరి 4 :-* పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీ4 విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభిచనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీ4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది…అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు. దీనిపై సమగ్ర విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్ను తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. పేదరిక నిర్మూలన విషయంలో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలను తీసుకుని పీ4 విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సచివాయంలో ప్లానింగ్ శాఖపై సమీక్ష సందర్భంగా పీ4 కార్యక్రమం ప్రారంభంపై అధికారులతో చర్చించారు. పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలతో పాటు కొంత ఉన్నత స్ధాయిలో ఉన్నవారు పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని….వీరందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చి పీ4 విధానం అమలు చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో ప్రత్యేక సర్వే ద్వారా అట్టగుడున ఉన్న వర్గాలను గుర్తించి…వారికి సాయం అందేలా చేస్తామన్నారు. దీనికోసం అవసరమైన డేటాను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు తమ సొంత ఊళ్లు, మండలాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారని…అలా ఆసక్తి ఉన్న వారిని స్వయంగా ఆహ్వానించి…ఉగాది రోజున పీ4 కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తామన్నారు. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్ట్నర్షిప్ విధానం అమలు ద్వారా పేదరిక నిర్మూలకు అడుగులు వేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్, ప్లానింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
*********